15-05-2025 04:41:11 PM
ఇబ్రహీంపట్నంలోని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఘటన...
ఇబ్రహీంపట్నం: అసలే ఆకలి.. ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఆ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. ఒక్కసారిగా అందులో బల్లిని చూసి యాక్! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన ఇబ్రహీంపట్నంలో రెస్టారెంట్లో గురువారం వెలుగుచూసిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(Ibrahimpatnam Municipality) సాగర్ రహదారిపై ఉన్న మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్(Mehfil Family Restaurant) లో శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి, తింటుండగా అందులో చనిపోయిన బల్లి కనిపించడంతో షాక్ కి గురయ్యారు. ఇదేమిటని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది, తిను అంటూ అహంకారంగా ప్రవర్తించారని, దీంతో ఆగ్రహానికి గురైనా బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా పోలీసులు మేనేజర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బిర్యానీ తిన్న బాధితులు ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇబ్రహీంపట్నంలో చాలా వరకు జరుగుతున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యలు మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.