30-09-2025 04:32:03 PM
కలెక్టర్ బాదావత్ సంతోష్..
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, కరపత్రాలపై ప్రింటర్ వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా జరిగే పార్టీ సమావేశాలపై కేసులు బుక్ చేయాలని సూచించారు.
అలాగే గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు తొలగించాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్లు, వెబ్ క్యాస్టింగ్, ఐటీ ఆధారిత పర్యవేక్షణను బలోపేతం చేసి, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.