23-01-2026 01:30:50 PM
తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ప్రయాణికులంతా సేఫ్..
తాండూరు, 23 జనవరి, (విజయక్రాంతి): ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ఘటన వికారాబాద్ జిల్లా పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, డిపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ బస్టాండ్ నుండి మెట్లకుంట వెళ్లేందుకు 11 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇదే సమయంలో కొడంగల్ వైపు నుండి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. బస్సు అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్ నారాయణ కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు రోడ్డుపైన ఉండడంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.