22-11-2025 12:00:00 AM
సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
అర్మూర్, నవంబర్ 21 (విజయ క్రాంతి) : దేశ ప్రజల సంపదను, వనరులను దోచుకుంటున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడే వారిని బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపుతున్నారని రాజ్యాంగ సూత్రాలని నిర్మూలిస్తున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ దుయ్యబట్టారు. శుక్రవారం ఆర్మూర్ ప్రజాపంథా ఆఫీసు లో విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశ ఖనిజ సంపదలను పెద్ద పెద్ద కార్పొరేట్ లకు కట్టబెట్టే కుట్ర లో భాగంగా ఆదివాసులను ఎల్లగొడుతున్నారని అన్నారు.
పాలకుల యొక్క దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిని నరమేధంతో నిర్మూలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కగార్ పేరుతో దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా కొనసాగిస్తున్న బూటకపు ఎంకౌంటర్ల హత్యాకాండపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరిపై హత్యా నేరం కేసుపెట్టి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే బూటకవు ఎన్కౌంటర్ల హత్యాకాండను, కగార్ హత్యాకాండను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపటానికి ముందుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరిస్తుందని, మొదట చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించి ఆచరణలో మోసం చేసిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలో హక్కుల ప్రకారం ప్రశ్నించడం, ప్రజాస్వామ్య ప్రక్రియ రానున్న కాలంలో చీకటి రాజ్యంగా మారుతుందని ఆయనఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ ఫాస్టెస్ట్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం, జిల్లా నాయకులు ఎం.ముత్తన్న, ఏ.ఐ.యు.కె.ఎస్. నిజాంబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, బి.కిషన్, పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షుడు ఎం. ఎం.నరేందర్, నిఖిల్, నజిర్, పోసన్న, సామెల్ తదితరులు పాల్గొన్నారు.