07-12-2025 12:18:06 AM
‘సావిత్రి మహోత్సవం’ శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. దివంగత నటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ ఛైర్మన్ సంజయ్ కిషోర్ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-.. “మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో సావిత్రి ప్రేక్షకులను మైమరపించేవారు.
ప్రతి చిత్రంలో పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదు. ‘సినీరంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథం. సినీరంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రే’నని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. మురళీమోహన్, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి తదితరులు ఈ కార్యక్రమాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్, రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరించారు. ఈ వేడుకల్లో 90 మంది బాల గాయకులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. సావిత్రిపై రూపొందించిన అవార్డు గ్రహీతల డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.