పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
దౌల్తాబాద్ (విజయక్రాంతి): పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన జాల సుధాకర్(39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తన వ్యవసాయ పొలంలో అప్పులు చేసి మరీ మూడు బోర్లు వేయగా పడకపోగా ఆ అప్పులు తీర్చే మార్గం కనబడక తరచు మదనపడుతుండేవాడు.
తీవ్ర మనస్థాపానికి గురై తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగి ఇంటికి రాగా గమనించిన భార్య స్థానికుల సహాయంతో గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సుధాకర్ మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఏఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు.






