10-01-2026 03:36:34 PM
ఘనంగా తొగర్రాయిలో చిన్న సమ్మక్క సారలమ్మ జాతర
వనదేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,(విజయక్రాంతి): అనాది కాలము నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో నిర్వహించిన సమ్మక్క- సారక్క జాతరలో ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధి వర్షాలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. పూజారి గౌని సైదమ్మ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ని ఘనంగా సన్మానించి, గాజులు ప్రసాదాలు అందజేశారు.
గృహ జ్యోతి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు మేలు జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. అనంతరం గృహ జ్యోతి లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్, ఆర్థిక, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాసిన పత్రాన్ని లబ్ధిదారుకు అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఆరు హామీలను అమలు చేస్తుందని, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను అందజేస్తుందని, ఇప్పటివరకు రాష్ట్రంలోని 52.83 లక్షల కుటుంబాలకు చెందిన రూ.3600 కోట్లను విద్యుత్ బిల్లును లబ్ధిదారుల తరఫున ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించిందని అన్నారు.