16-10-2025 02:06:35 PM
న్యూఢిల్లీ: నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ, పోలీసు అధికారులపై అనేక ప్రాణాంతక దాడులకు సూత్రధారి అయిన తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న(Maoist leader Ashanna ) పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉంది. సుమారు 120 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి ముందు ఆశన్న లొంగిపోయే అవకాశముంది. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న 1991లో పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు. 1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా ఆశన్న నియామకం అయ్యారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని 2003 అలిపిరి దాడికి కుట్ర పన్నారని, మాజీ మంత్రి ఎ. మాధవ రెడ్డి, ఐపీఎస్ అధికారి కె.ఎస్. ఉమేష్ చంద్ర హత్యలకు సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, అతని 60 మందికి పైగా సహచరులతో కలిసి లొంగిపోవడం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో ఫైర్ బ్రాండ్ సభ్యుడైన భూపతి, సోను, సోను దాదా, వేణుగోపాల్, అభయ్, మాస్టర్, వివేక్, వేణు వంటి అనేక ఇతర మారుపేర్లతో పిలుస్తారు.