02-12-2025 02:30:17 AM
* విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి
* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్, డిసెంబర్ 1 :ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఆదివారం సాయంత్రం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4వ ఓపెన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంత నగదు తో నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు.. నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని.. పటాన్చెరులో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో మైత్రి స్టేడియం ఆధునికరించడం జరిగిందని గుర్తు చేశారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను.. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. క్రీడ పోటీల నిర్వహకురాలు ఇంటూరి రేఖను ప్రత్యేకంగా అభినందించారు.