08-03-2025 01:03:15 PM
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సీతక్క(Minister Seethakka) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని గుర్తుచేశారు.
ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమని సీతక్క(Seethakka) స్పష్టం చేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం, పదిమందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని తెలిపారు. ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.