07-07-2025 11:54:49 PM
కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించే పోలీసులు..
రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
కేటీఆర్..
హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనను అడ్డుకున్న ములుగు పోలీసులు, కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారన్న సంగతి అర్థం అవుతుందన్నారు. నిన్న అర్థరాత్రి నుంచే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాలపై దొంగల లెక్క విరుచుకుపడ్డ పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏం పోలీసింగ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో ములుగు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కొంతమంది పోలీసులకు న్యాయస్థానాల్లో చివాట్లు పడుతున్నా ఇంకా సోయి రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ములుగు నియోజకవర్గంలో తన సొంత రాజ్యాంగం అమల్లో ఉందని భ్రమిస్తున్న మంత్రి సీతక్క, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ములుగు జిల్లాలో సీతక్క చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.