19-11-2025 11:29:27 PM
మంత్రి కొండా సురేఖ..
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ అందిస్తున్న నాణ్యమైన ఇందిరమ్మ చీరను తాను కూడా కట్టుకుంటానని దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ తెలిపారు. పేద మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరను కట్టుకోవడం తాను గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సురేఖ హాజరై మాట్లాడారు.
మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు నాణ్యమైన చీరలు అందించాలన్న సంకల్పంతోనే పంపిణీ కొంత ఆలస్యం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి.. చీరల పంపిణీ ప్రక్రియను మొత్తం అభాసుపాలు చేశారన్నారు. ఇందిరమ్మ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, చీరల నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు.