13-09-2025 06:42:13 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో రాష్ట్ర కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి శనివారం పర్యటించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన ,పట్టణంలోని 19 వ వార్డ్ విద్యానగర్, చెంచు కాలనీ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాలనీ సమీపంలో ఉండే వాగు ఉప్పొంగి వాగు నీరు ఇళ్లలోకి చేరి ఇళ్లంతా బురద మయం అయి ఇంట్లోని నిత్యావసర సరుకులు తడిసి ముద్ద య్యాయని పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. బాధితులు అధైర్య పడవద్దని త్వరలోనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
వరద నీటితో నిత్యవసరాలు కోల్పోయిన బాధితులకు నిత్యవసర సరుకులు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నాయకులు ఎండి పాషా, కనకం రామకృష్ణ లను పరామర్శించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మంచికట్ల శంకరయ్య, కోల అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని బరోసా ఇచ్చారు.
నిత్యావసర సరుకులు పంపిణీ...
నిన్న కురిసిన వర్షానికి నిత్యావసర సరుకులు కోల్పోయిన బాధిత కుటుంబాలకు మంత్రి వివేక్ ఆదేశాల మేరకు నిత్యా సరుకులు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షంతో నిత్యావసర సరుకులు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వర్షాల మూలంగా ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.