ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల పర్యటన
వరంగల్: మిస్ వరల్డ్ పోటీదారులు(Miss World contestants) బుధవారం చారిత్రక వరంగల్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ, మేళతాళాలతో అతిథులకు మహిళలు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya), సీపీ సన్ ప్రీత్ సింగ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు చారిత్రక నగరిలో పర్యటించి, ఓరుగల్లు చారిత్రక వైభవాన్ని తెలుసుకోనున్నారు. అలాగే వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటను సుందరీమణులు వీక్షించనున్నారు.
రెండు బృందాలుగా వరంగల్ లో పర్యటిస్తున్న అందాల భామలు.. ములుగులోని రామప్ప ఆలయ(Ramappa Temple)న్ని మరొక బృందం సందర్శించింది. రామప్ప ఆలయం వద్ద భారతీయ సంప్రదాయ చీరకట్టులో విదేశీ భామలు సందర్శించి, గ్రూప్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. రామప్ప ఆలయ విశిష్టతను టూరిజం గైడ్లు ప్రపంచ సుందరీమణులకు వివరించారు. అనంతరం రామప్ప వద్ద పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాల ప్రదర్శన, లేజర్ షో, లైటింగ్ షోలను మిస్ వరల్డ్ పోటీదారులు తిలకిస్తున్నారు. ఈ పర్యటన దృష్ట్యా జిల్లాలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.






