26-09-2025 12:54:13 AM
క్రీడాకారులకు 70 వేల రూపాయల ఆర్థిక సహాయం
పటాన్ చెరు(అమీన్పూర్), సెప్టెంబర్ 25 :ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండల పరిధిలోని కానుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫాతిమా, కీర్తన, ఆకాంక్ష, లావణ్య, స్మితిక విద్యార్థులు ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఉషూ రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు,
వెండి పతకాలతో సాధించారు. త్వరలో తమిళనాడులో జరగనున్న సౌత్ జోన్ నేషనల్ పోటీలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులను అభినందించడంతో పాటు రూ.70 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మండల కేంద్రాల్లో అన్ని వసతులతో స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అశోక్, పరమేష్ యాదవ్, పెద్ద రాజు పాల్గొన్నారు.