పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు,(విజయక్రాంతి): ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడంలేదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తన పెద్ద కుమారుడు దివంగత గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మరణం అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు నియోజకవర్గం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరారు. కుల మతాలకు అతీతంగా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం భగవంతుని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున సన్నిహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిమానం, ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






