01-11-2025 05:33:11 PM
జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని..
హనుమకొండ (విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం, చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున పబ్లిక్ గార్డెన్స్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళ వేదికలో ఏర్పాటు చేసిన జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు.
ఈ సంత ద్వారా స్థానిక రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, వినియోగదారులు కూడా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా రైతుల వద్ద నుండే పొందగలరు అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంతలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రైతులు, చేనేత కార్మికులు, గిరిజన కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి ఉత్పత్తుల ప్రత్యేకతలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన సేంద్రియ పంటలు, చేనేత వస్త్రాలు, గిరిజన హస్తకళా ఉత్పత్తులను అభినందించారు.