01-11-2025 04:51:39 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అన్నారు. రైతులు తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని సూచించారు. నిర్ణిత సమయానికి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, రైతులకు వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు కలుగకూడదని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే, చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వరి ధాన్యం శుభ్రపరిచే యంత్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.