06-01-2026 12:26:16 AM
సవరించేది ఎలా ..?
తలలు పట్టుకుంటున్న అధికారులు
తాండూరు, 5 జనవరి, (విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఈనెల 10వ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు. మున్సిపల్ అధికారులు గత మూడు రోజుల క్రితం విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా తప్పుల తడకగా మారిందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదులు చేశారు.
వి నేపథ్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. గతసారి అప్పటి ఎన్నికల్లో 36 వార్డులకు గాను 14 వేల ఓటర్లు అదనంగా ఎలా చేస్తారు అని అందుకు కారణాలు తెలపాలంటూ కాంగ్రెస్ పార్టీ మినహా అఖిలపక్షం నాయకులు పట్టు పట్టారు. ఒక్కసారిగా అధికారులను రాజకీయ నాయకులు ప్రశ్నించడంతో సమావేశం కాసేపు గందరగోళంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ జాబితా గజిబిజిగా మారిందని బిజెపి ,బి ఆర్ ఎస్, ఎంఐఎం, సిపిఐ పార్టీల నాయకులు ఆరోపించారు.