30-09-2025 12:00:00 AM
గ్రామస్తులే పారిశుధ్య కార్మికులైన వేళ..
పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించని సిబ్బంది
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి పట్ట పట్టణం నాలుగో వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామంలోని బతుకమ్మ కాల్వ (కుంట) లో చెత్త, గడ్డితో నిండిపోయి బతుకమ్మ నిమజ్జనాలకు అనుకూలంగా లేకుండా మారింది. ఈ విషయంపై గ్రామస్తులు గత ఐదు రోజులుగా పలుమార్లు మున్సిపల్ అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో చివరికి సోమవారం ప్రజలే ముందుకు వచ్చారు.
నీళ్లలోకి దిగి స్వయంగా గడ్డిని కోసి తొలగించి కాలువను శుభ్రం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన గ్రామస్థులే పారిశుద్ధ్య కార్మికుల్లా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవునిపల్లికి సంబంధించిన బతుకమ్మలే కాకుండా పట్టణంలోని వివిధ వార్డుల బతుకమ్మలను కూడా ఇదే కాలువలో నిమజ్జనం చేస్తారు.
ఈ నేపథ్యంలో కుంట శుభ్రత అత్యవసరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ప్రజలే కష్టపడటమే కాకుండా, పండుగ పట్ల భక్తి భావంతో ముందడుగు వేసి కుంటను శుభ్రపరిచారు. మున్సిపల్ అధికారుల తీరుపై అవార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.