calender_icon.png 16 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈర్ష్యాసూయలు వద్దు

18-08-2024 12:00:00 AM

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బతకాలనే ఆశ చిగురిస్తే సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్ధం గా కొనసాగుతున్నాయి. ‘తాము బాగుండాలి, ఇతరులు ఏమయినా ఫరవాలేదు’ అనే సంకుచిత మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి. విద్యావంతుల్లో కూడా ఇలాంటి నైజం పెరగడం విద్యకున్న విలువను తగ్గిస్తున్నది. నేటి చదువులు విలువలను నేర్పడం లేదు. ఈ కారణం వల్లే ఇలాంటి పెడధోరణులు తలెత్తుతున్నాయి. ఇతరులకు పెట్టి, తినాలనే జ్ఞానం నశించి, పరుల కడు పు కొట్టి తినాలనే దుర్మార్గం పెరిగింది. ఇలాంటి ధోరణులు పెరగడానికి గల కారణాలను కనిపెట్టి, సంస్కారవంతమైన సమాజం కోసం కృషి చేయా లి. విద్యావంతులు, మేధావులు, సంస్కర్తలు ఇందు కు తగిన కృషి చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత అధికం కావాలి.

మనిషే సర్వ శక్తిమంతుడు

తన సృజనతో శిలను చెక్కి, దానికొక అందమైన రూపాన్ని కల్పించి, జీవకళ ఉట్టిపడేలా చేసిన  శిల్పకారుడు ఎంతటి ప్రశంసార్హుడో, ఈ సమస్త సృష్టిని తన మేధస్సుతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మేధావులంతా ప్రశంసాపాత్రులే. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మానవుడే ఈ చరాచర జగత్తులో అత్యంత శక్తివంతుడు. ఆలోచనా జ్ఞానం, విచక్షణ వంటి పలు విశి ష్టతలతో విలక్షణమైన లక్షణాలతో మానవ మేధ స్సు కొనసాగుతున్నది. కొన్ని జీవరాశులు మానవజాతికంటే బలమైనవైనా వాటికి బుద్ధిబలం, విచక్ష ణా శక్తి లేకపోవడం పెద్దలోటు. పురాణకాలం నుండి నేటికాలం వరకూ మానవజాతి ఔన్నత్యం గురించి అనేక ప్రాచీన గ్రంథాల్లో, ఆధునిక రచనల్లో విశదీకరించారు.

అటువంటి మహిమాన్వితమైన మానవ శక్తి నిర్మాణాత్మకంగా ఉపయోగపడకుండా  విధ్వంసకరంగా పరివర్తన చెందడం నేటి వ్యవస్థ చేసుకున్న పాపమేమో అనిపించక మానదు. వివే కం స్థానంలో మూర్ఖత్వం, విచక్షణ స్థానంలో విధ్వం స బీజాలు బలంగా నాటుకుపోయాయి. మానవ మేధస్సు వక్రమార్గంలో పయనిస్తున్నది. మానవుని ఆలోచనా విధానం తప్పుడు మార్గంలో పురోగతి చెందడం అనర్థదాయకం-, అటవికం. కొత్త నీరొచ్చి పాత నీరును పక్కకు గెంటినట్టుగా పాతతరాన్ని, పాతతరపు ఆలోచనలను నవతరం ఎప్పటికప్పడు పక్కకు నెడుతూ మార్పు చెందడం కాలానికున్న సహజ లక్షణం.

అయితే, గతంలో ఒక తరం వారి ఆలోచనా విధానాలను అవగతం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ వారు చూపిన బాటలో పయనించడానికే ప్రయత్నం చేసేవారు. కుల, మత, వర్గ బేధాలు పాతకాలంలో ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి అరమరికలు లేని జీవన విధానం అనుసరిం చే వారు. నేటి కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎక్క డా కనిపించవు. బలవంతులకే అగ్రతాంబూలం-. డబ్బున్న వారికే సమాజంలో విలువ. డబ్బుంటే తప్పులన్నీ ఒప్పులుగా చెలామణీ అవుతున్న రోజులివి. మనిషి సృష్టించిన నోటు మనిషినే కబళించే విడ్డూరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నోటుకున్న ప్రాధాన్యత నోటిమాటకు లేదు. సమాజమంతా అసూయతో నిండిపోయింది. అహంకారపు పైత్య ప్రకోపాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. 

అవాంఛనీయ ధోరణులు

మనసును తీవ్ర కలతకు గురిచేసే పరిణామాలు నేటి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. సమా జం అంటే మనుషుల సమూహమే కదా. మనసు లేని  మనుషుల్లో అంకురించే అవాంఛనీయ, అమానవీయ, విధ్వంసకర బీజాలు మనసున్న ప్రతి ఒక్క రినీ కదిలించక మానవు. మనం ఎందుకు బతుకుతున్నామో మనకైనా తెలుస్తున్నదా? కనీసం ఆలో చించే మనస్తత్వమైనా మనుషుల్లో నిక్షిప్తమై ఉందా? అంటే, లేదనే సమాధానమే తిరిగి వస్తుంది. ఇతరులను హింసించే వారు కొందరైతే, హింసతో సంతోషించే వారు మరి కొందరు. పెట్టిన చేతులను నరికేవారు ఇంకొందరు. బంధాలనే బలవంతంగా తెంపేసి, నీతులు చెప్పేవారు మరికొందరు.

ఎందుకిలాంటి మనస్తత్వాలు మనిషిలో వికృతంగా గూడుకట్టుకు పోతున్నాయో అర్థం కావడం లేదు.  పోయిన తర్వాత ఆరడుగుల నేలకూడా మనది కానప్పుడు, అన్నీ తెలిసిన మానవుడు ఎందుకింత స్వార్థ పరుడవుతున్నాడు? కరెన్సీ కట్టలలోనే మోక్షాన్ని వెతుక్కుంటూ, స్వార్థమే పరమార్థమని భ్రమిస్తూ, పైశాచికానందంలోనే వికృతమైన సంతృప్తి పొందే నేటి కాలపు వింత ధోరణులు ధ్వంస జీవన ప్రమాణాలకు పరాకాష్ఠ. ఇలాంటి ధోరణులు విడనాడక పోతే మానవ జీవితం ఆత్మహత్యా సదృశమే. సద్గుణాలవల్లనే మనిషి ఉత్తముడు కాగలడు తప్ప తెచ్చిపెట్టుకున్న డాంబికాల వల్ల కాదు.

శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షికాగలదా? మనలోని మంచితనం వల్లే మనకు విలువ పెరుగుతుంది. ఓర్వలేని తనంతో కొంతమంది మనల్ని అందరికీ దూరం చేసినా దీర్ఘకాలంలో అది వారికే ఎదురు తిరిగే ఆయుధం అవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని ఫలం దీర్ఘకాలంలో మధురంగానే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనిం చి, ప్రతీ వ్యక్తి పరులకు అపకారం చేయకుండా సద్వర్తనంతో మెలగడమే ఉత్తమోత్తమం. సృజనశీలురు, త్యాగశీలురు, సమాజహితులు, సద్వర్తనులే మానవాళి మనుగడకు మూలస్తంభాలు. నేటి ఆధునిక సమాజ వైఖరి మారకపోతే మానవాళి మనుగడ త్రిశంకుస్వర్గంలా సందిగ్ధావస్థలో పడక తప్పదు.

 సుంకవల్లి సత్తిరాజు