30-09-2025 02:26:52 AM
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బండ్ల బజార్లో ఆదివారం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ ప్రాంత భక్తులు ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. శ్రీ చండీ మాత అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పూజా కార్యక్రమంలో 51 రకాల పిండివంటలతో ప్రసాదాలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ ప్రాంతవాసులు శ్రీదేవి శరన్నవ రాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం మండపం ఎదురుగా తులసి కోట వద్ద ఆనంద సందోహాల నడుమ బతుకమ్మ నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.
సోమవారం ఎంగిలిపూల బతుకమ్మ కావడంతో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆటపాటలతో పూజా కార్యక్రమాలు అనంతరం గంగ ఒడికి బతుకమ్మలను మహిళలు చేర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ పాల్గొన్నారు.