హాలో శుభోదయం.. మన ఊరికి మన సర్పంచ్..
ములకలపల్లి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం గ్రామంలో సోమవారం మన ఊరికి మన సర్పంచ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహిస్తున్న హలో శుభోదయం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో హలో శుభోదయం మన ఊరికి మన సర్పంచ్ అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సర్పంచ్ కుంజా వినోద్ తెలిపారు. పంచాయతీ కార్మికులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, స్వయంగా చీపురు చేతపట్టి వీధులను శుభ్రపరిచారు. గ్రామంలోని షాపులు, ఇళ్ల ముందు అపరిశుభ్రంగా ఉండి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
ఇకపై రోడ్లపై లేదా వీధుల్లో చెత్త వేయవద్దని, పంచాయతీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో మాత్రమే చెత్త వేయాలని షాపు యజమానులు, గ్రామస్తులను కోరారు. డస్ట్బిన్లలో వేసిన చెత్తను పంచాయతీ కార్మికులు క్రమం తప్పకుండా సేకరిస్తారని గ్రామాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడమే మన ప్రధాన లక్ష్యమని ఇందుకు గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకుని, మన గ్రామాన్ని ఆరోగ్య కరమైన గ్రామంగా తీర్చిదిద్దుకుందామని గ్రామస్తులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు, కాంగ్రెస్ నాయకులు కొప్పుల రాంబాబు, వేముల మురళి, సురభి రాజేష్, మిడియం నారాయణ, పిడియాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.






