26-11-2025 12:03:09 AM
రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రి తుమ్మల
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రైతు నేస్తం కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేయడం వల్ల ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలన్ని తెలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని రైతులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లును, జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా 5,500 క్వింటాళ్ల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్ పంటల్లో అంతర పంటల సాగు ఆవశ్యకత గురించి, వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో దున్ని పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించారు. రాష్ర్టంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, సీసీఐ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డితో మంత్రి తుమ్మల ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు సునిల్ తదితరులు పాల్గొన్నారు.