11-05-2025 01:47:02 AM
న్యూఢిల్లీ, మే 10: పాకిస్థాన్ అసత్యాలకు లెక్కే లేదని భారత సైనికాధికారులు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అనంతరం భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి, నేవీకి చెందిన కమొడోర్ రఘు ఆర్ నాయర్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘భారత సైన్యం, నేవీ, వైమానిక దళం ఒప్పందానికి మేము కట్టబడి ఉంటాం.
కాల్పుల విరమణ జరిగినా సైన్యం నిరంతరం సన్నద్ధతలో ఉంటుంది. మాతృభూమి రక్షణ కోసం మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్నాళ్లూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలను దీటుగా ఎదుర్కొన్నాం. భవిష్యత్లో కూడా పాక్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని పేర్కొన్నారు.
పాక్ అబద్దాలకు లెక్కే లేదు
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ అబద్దాలకు, అసత్యప్రచారాలకు లెక్కే లేదు. ఎస్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలపై జేఎఫ్ దాడి చేసినట్టు ప్రచారం చేసుకుంటుంది. అది పూర్తిగా అవాస్తవం. భారత్కు చెందిన సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, భఠిండా, నైలా, భుజ్ వైమానిక స్థావరాలకు, చంఢీగఢ్లో ఉన్న భారత ఆయుధగారానికి నష్టం చేకూర్చామని పాక్ ప్రకటించుకుంది. అవన్నీ పచ్చి అబద్దాలు. భారత ఆర్మీ మసీదులపై దాడి చేసిందని పాక్ ఆరోపించింది. భారత్ లౌకిక దేశం.. అటువంటి దుశ్చర్యకు ఎప్పుడూ పాల్పడదు.
మనం చేసిన ప్రతిదాడులతో పాకిస్థాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. పాకిస్థాన్ క్షిపణి, రక్షణ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాం.’ అని ఖురేషి పేర్కొన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ..‘భారత్కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రస్థావరాలపైనే దాడులు చేశాం. ఒక్క ప్రార్థనా స్థలాన్ని కూడా ధ్వంసం చేయలేదు.’ అని పేర్కొన్నారు.