22 April, 2026 | 4:32 AM

నేడు శాంతిచర్చలు?

22-04-2026 01:49 AM
  1. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత భేటీ?
  2. ఇస్లామాబాద్‌కు బయల్దేరిన ఇరు దేశాల బృందాలు: పాక్
  3. ఇరాన్‌కు వేరే మార్గం లేదు.. చర్చలకు రావాల్సిందే: ట్రంప్
  4. చర్చలకు వచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్
  5. రేపు రాత్రితో సీజ్‌ఫైర్ ఒప్పందం గడువు పూర్తి
  6. చర్చల అంశం తేలకపోవడంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ

టెహ్రాన్/ ఇస్లామాబాద్/ వాషింగ్టన్, ఏప్రిల్ ౨౧: అమెరికా- -ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతున్నది. దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరగాల్సి ఉండగా, చర్చలపై సందిగ్ధత నెలకొన్నది. అమెరికా నుంచి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరాయని పాకిస్థాన్ స్పష్టం చేసింది.

చర్చల కోసం ఇస్లామాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది. జేడీ వాన్స్ బృందం పాక్ ప్రయాణానికి సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ, శాంతిచర్చలపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. బుధవారం రాత్రితో అమెరికా ఇరాన్ మధ్య రెండువారాల తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు ఉంటాయా.. లేదా అనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

సమయం లేదు: ట్రంప్

శాంతిచర్చలకు రావడం తప్ప ఇరాన్‌కు మరో దారి లేదని, వారు చర్చలకు వచ్చినా, రాకున్నా తమకు మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే ఆలోచనే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్ నాయకత్వం కోరుకుంటే, స్వయంగా తానే ఆ దేశ బృందంతో భేటీ అవుతానని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆ దేశం మాట వినకుంటే, ఆ దేశంపై బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. అమెరికా సైన్యం ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నదని, తాను ఆదేశిస్తే తిరిగి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

దిగ్బంధాన్ని సహించం : ఘాలిబఫ్

ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పటికీ మెత్తబడలేదు. చర్చలకు ఆ దేశం ససేమిరా అంటున్నది. అమెరికా విధిస్తున్న అలవిగాని షరతులు, తమ ఓడరేవులు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధం తమను బాధించిందని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను బెదిరించలేరని, చర్చలకు అంగీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే, మరోవైపు అమెరికన్ సైన్యం తమ నౌకలపై దాడులు చేయడమేంటని నిలదీశారు. టెహ్రాన్ లొంగిపోయేలా ఒత్తిడి చేసి, యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే, ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా స్పందిస్తూ.. తమ చేతులు తుపాకీ ట్రిగ్గర్ మీదనే ఉన్నాయని, అమెరికా బెదిరింపులకు తాము లొంగేది లేదని తేల్చిచెప్పారు.