15-07-2025 10:14:10 PM
జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి
పెన్ పహాడ్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పిఆర్టియు టీఎస్ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భక్తలాపురం, గాజుల మల్కాపురం, లింగాల, అనాజిపురం, మోడల్ స్కూల్, కేజీబీవీ, పెన్ పహాడ్ తదితర పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంధ్యల వినోద్, నల్ల శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ నాయకులు మేకల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఉపాధ్యాయ సమస్యల సాధనలో PRTU TS సంఘం ముందు ఉంటుందని, బదిలీలకు ప్రమోషన్లకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో PRTU TS సంఘం తనదైన ముద్ర వేసి ప్రభుత్వాన్ని ఒప్పించిందన్నారు. పెన్ పహాడ్ మండల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పి ఆర్టియులో సభ్యులుగా నమోదయి సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా కోరారు. రాబోయే కాలంలో ఈ హెచ్ ఎస్ విధానాన్ని నూతన పద్ధతిలో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.