ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చండూరు సీఐ ఆదిరెడ్డి
చండూరు (విజయక్రాంతి): రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చండూరు సీఐ ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, మొంథా తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని.. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని.. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని.. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
ఎక్కువ లోతు ఉన్న ప్రధాన రహదారుల వద్ద నీరు ప్రవహిస్తే వాహనదారులు, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, మాకు వెంటనే సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదని ఆయన ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులలో సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.






