02-07-2025 12:31:20 AM
మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అమలుపై సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూలై-1 (విజయ క్రాంతి) ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలలో నమ్మకం కల్గించాలని, మంథని ప్రాంతంలో ప్రజలకు అందించే వైద్య సేవలు మరింత ఇంప్రూవ్ కావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అమలు పై సంబంధిత వైద్య అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పని తీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో మొత్తం 14 వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజల నుంచి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు అనే ఫిర్యాదులు వస్తున్నాయని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం, సిసి కేమేరాల ఏర్పాటు చేయాలని,మంథని ఆసుపత్రి నుంచి అధికంగా రిఫరల్ కేసులు రాకుండా చూడాలని, అత్యవసర క్రిటికల్ కేసులను మాత్రమే పెద్దపల్లి, గోదావరిఖని కు రిఫర్ చేయాలని అన్నారు.
మంథని ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో నెలకు 25 ప్రసవాలు జరిగేలా చూడాలని,ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల వారిగా గర్భిణీ స్త్రీల ను ట్రాక్ చేస్తూ ప్రసవం కోసం మంథని ఎం.సి.హెచ్ ఆసుపత్రికి వచ్చేలా చూడాలని అన్నారు. ప్రసవాల తర్వాత అవసరమైన పోస్ట్ ఆపరేటివ్ కేర్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, నవజాత శిశువుల సంరక్షణ కోసం అవసరమైన వార్మర్, ఇతర పరికరాల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సి.హెచ్.సి మంథని లో ఔట్ పేషెంట్ సేవలు పెరగాలని, వైద్యులు ఓపి సమయంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ రోగులను సరిగ్గా రిసివ్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందిస్తే ప్రజల్లో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెరుగుతుందని అన్నారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని అన్నారు.
వైద్యులు, సిబ్బంది సెలవుల మంజూరు ప్రణాళిక ప్రకారం జారీ చేయాలని, జూలై నెలలో స్పష్టమైన మార్పు చూపించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, డి.సి.హెచ్.ఓ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులుపాల్గొన్నారు.