06-07-2025 06:20:27 PM
పశు సంవర్ధక సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్..
తుంగతుర్తి (విజయక్రాంతి): పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్(Anti-Rabies Vaccine) వేయించాలని ప్రాంతీయ పశు సంవర్ధక అధికారి డాక్టర్ రవిప్రసాద్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసి మాట్లాడారు. కుక్క కరిస్తే భయంకరమైన రేబిస్ వ్యాధి వస్తుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుక్క కరిచిన ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రం చేసి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని పేర్కొన్నారు. పెంపకందారులు ఈ టీకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుమారుగా 28 పెంపుడు కుక్కలకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకుల నరేష్, గోపాలమిత్ర కుంచాల శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది మెంతబోయిన గణేష్, బుచ్చిబాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.