21-07-2024 02:39:47 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): గ్రేటర్ రహదారుల్లో వాహ నాల ద్వారా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు, జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడు తోంది. జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాలన్నీ నగరాలుగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ప్రధాన కూడళ్లను అభివృద్ది చేయాలని జీహెచ్ఎంసీ భావించింది.
చాలా దేశాల్లో 40 నుంచి 60 శాతం వరకు జంక్షన్ల వద్దనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జంక్షన్లను కూడా మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జంక్షన్ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, పాదాచారులు ప్రమాదాలకు గురికాకుండా ఫుట్ పాత్లను నిర్మించడం వంటి చర్యలు చేపడుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా సర్కిళ్ల వారీగా జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు అధికారుల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో ఇప్పటికే కొన్ని జంక్షన్ల పనులు పూర్తికాగా, మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి.
రూ. 78 కోట్లతో అభివృద్ధి..
గ్రేటర్లోని 6 జోన్ల పరిధిలో 150 డివిజన్లలో ప్రమాదాల నివారణ, వాహనాల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ అంతరాయం లేకుం డా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రేటర్ వ్యాప్తంగా 107 జంక్షన్లను అభివృద్ధి చేసి ప్రమాద రహితంగా తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఫుట్పాత్ల నిర్మాణం, పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ ప్రాంతాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. నిర్మాణ పనులకు దాదాపు రూ. 78 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటికే 107 జంక్షన్లలో 31 జంక్షన్ల పనులు పూర్తి చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. కాగా, మరో 13 జంక్షన్ల వద్ద పనులు పురోగతిలో ఉన్నాయి. 16 జంక్షన్ల వద్ద పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 8 పనులు టెండర్ ప్రాసెస్లో ఉండ గా, మరో 8 పనులకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 17 జంక్షన్లకు సంబంధించి న పరిపాలనాపరమైన అనుమతులు ఇంకా రావాల్సి ఉందని అధికారు లు చెబుతున్నారు.