29-01-2026 12:25:18 AM
బాన్సువాడ, జనవరి 28 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను బుధవారం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
సౌమ్య త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గతవారం నిజామాబాద్ నగరంలోకి వస్తున్న గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు రోడ్వాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టగా ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు.