19-07-2025 12:37:57 AM
గత పాలకులు పేద ప్రజలను నట్టేట ముంచారు
నూతన రేషన్ కార్డుల మంజూరుతో పేద ప్రజలు సంబర పడుతున్నారు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కాపులపల్లి, కనగర్తి గ్రామాల్లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయరమణా రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేసిన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేసి స్థానిక నాయకులతో కలిసి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించి వారి కళ్ళల్లో ఆనందం చూసేందుకు కృషి చేస్తున్నమన్నారు.
సంవత్సరం నర కాలంలోనే ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేస్తున్నామని, ప్రతి గ్రామంలో లక్షలాది రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నామని, అందులో భాగంగా నేడు కాపులపల్లి, కనగర్తి గ్రామాలలో ఇందిరమ్మ గృహాల మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాలు చేపట్టామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందిస్తున్నామని, గత పది సంవత్సరాలు రేషన్ కార్డ్ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన పాపాన గత ప్రభుత్వం పోలేదని ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.