30-10-2025 10:58:48 PM
సీఎండీ ముషారఫ్ ఫరూఖీ..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో దక్షిణ డిస్కం పరిధిలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మొత్తం 456 స్తంభాలు, 29 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన, డిండి ప్రాంతంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. నల్గొండలో 197 ఏల్టీ పోల్స్, 82 11 కేవీ పోల్స్, 23 ట్రాన్స్ఫార్మర్లు వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. నాగర్ కర్నూల్లో 105, సూర్యాపేటలో 42 పోల్స్ దెబ్బతిన్నాయని గురువారం ఫోన్ లైన్ లో మీడియాతో మాట్లాడారు.
33 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో సరఫరా నిలిచినా, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి తెల్దారుపల్లి, చెరుకుపల్లి సబ్స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరించారని చెప్పారు. కంబాలపల్లి, అక్కారం టవర్లు నేలమట్టం కావడంతో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ రాత్రిలోగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పనిచేస్తున్నారని, అన్ని ఫీడర్లలో విద్యుత్ ఈ రాత్రిలోగానే పునరుద్ధరిస్తామని సీఎండీ తెలిపారు.