08-01-2026 12:30:16 AM
తాంసి పోలీస్స్టేషన్లో మహిళా సిబ్బంది విశ్రాంతి గదిని ప్రారంభించిన ఎస్పీ
ఆదిలాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలకు జిల్లా పోలీసు యంత్రాంగం మొదటి ప్రాధాన్యతను ఇస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. బుధవారం తాంసి పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేకంగా నిర్మించిన నూతన గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా వేద మంత్రోచరణల నడుమ మహిళా కానిస్టేబుల్, మహిళా హోంగార్డుచే రిబ్బన్ కట్ చేపించి నూతన గదిని ప్రారంభించారు.
మహిళల భద్రత కై జిల్లాలో నూతనంగా మహిళ పోలీసు సిబ్బందిచే పెట్రోలింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు, మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలను చేపడుతున్నట్టు ఎస్సీ తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకై షీ టీం ఆధ్వర్యంలో పోలీసు అక్క, ఆపరేషన్ జ్వాల ప్రారంభించి చిన్నారులకు కరాటే లో శిక్షణ అందించడం జరిగిందన్నారు.
మహిళల పట్ల జరుగున్న నేరాలపై పాఠశాలలు, కళాశాలలు గ్రామ గ్రామాన మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చైతన్య పరిచయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తాంసి పోలీస్ స్టేషన్ ను పరిశీలించి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ సిబ్బందిని కేటాయించి సమస్యల పరిష్కరించాలని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న కేసులు దర్యాప్తును పూర్తి చేసి కోర్టులలో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్యామల్, హోంగార్డు రేఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.