18-12-2025 03:19:41 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ వికసిత భారత్ ఉపాధి, జీవనోపాధి మిషన్ (గ్రామీణ) బిల్లు 2025ను ఆమోదించింది. ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)ను ఒక ఉపాధి హామీ పథకంగా పునర్నిర్వచించింది. వీబీ-జీ-రామ్-జీ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ చట్టం ఎంజీఎన్ఆర్ఈజీఏ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తుందని ఆమె అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతామని, రాబోయే నెలల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం ముగిసిపోతుందన్నారు.
ఈ వీబీ-జీ-రామ్-జీ బిల్లు అమలు రాష్ట్ర ప్రభుత్వాలపై అనవసరమైన బాధ్యతను మోపుతుందని, తద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇచ్చే సంక్షేమ పథకాన్ని ఇది బలహీనపరిచే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద ఇప్పటి వరకు 100 రోజులు పని చేసేవారు. కానీ ఇప్పుడు 100 నుంచి 125 రోజులకు పని దినాలను పొడిగిస్తూ తీసుకోచ్చిన ఈ బిల్లును ఎవరైనా చదివితే, పథకం రాబోయే నెలల్లో ముగిసిపోతుందని స్పష్టంగా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును అందించే భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడగానే ఈ పథకం ముగిసిపోతుందని ఆమె చెప్పారు.