19-05-2025 12:00:00 AM
మెదక్, మే 18 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దేవస్థానంలో నీటిలో మునిగిపోతున్న బాలికను కాపాడడమే కాకుండా తప్పిపోయిన బాలుడిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్యూఆర్టి సిబ్బంది తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏడుపాయలకు ఒక క్యూఆర్టి పార్టీని పంపడం జరిగింది.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దగ్గర చెక్ డ్యామ్ వద్ద భక్తులు స్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక అమ్మాయి నీటిలో జారీ పడి మునిగింది. అది గమనించిన క్యూఆర్టి పార్టీ ఇంచార్జి ఏఆర్ ఎస్ ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్ళు యాదగిరి, రాజేందర్ డ్యామ్ లోకి వెళ్లి ఆ అమ్మాయిని బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.
అలాగే మధ్యాహ్న సమయంలో కామారెడ్డి జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన లలిత్ అనే నాలుగు సంవత్సరాల బాబు తప్పిపోగా గమనించిన క్యూఆర్టి సిబ్బంది అబ్బాయిని తల్లితండ్రుల వివరాలు తెలుసుకొని వారికి క్షేమంగా అప్పగించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏ ఆర్ ఎస్ఐ శ్రీనివాస్ను, అతని సిబ్బందిని అభినందించారు.