12-07-2025 12:44:13 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 11 (విజయ క్రాంతి): విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కాటారం మండలం దామెరకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, గంగారం మోడల్ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పరిశుభ్రత కరువైందని గుర్తించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
డైనింగ్ హాల్ పరిశీలించి వంట కోసం తెచ్చిన కూరగాయలు పరిశుభ్రంగా లేకపోవడం, వంటగదిలో ఈగలు ఉండడం, వంటగది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ఆహార తయారీ ప్రదేశాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ , స్టోర్ రూమ్, డార్మెటరీలను పరిశీలించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాల వెనుక గల హాస్టల్ భవనాన్ని పరిశీలించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో బాబు తదితరులు పాల్గొన్నారు.