22-08-2025 01:32:35 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, ఆగస్టు 21 : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజగోపాల్ రెడ్డి రాజీ పడే ప్రసక్తే లేదని, పేదవానికి సహాయం చేయాలనే సామాజిక బాధ్యత ఉన్నప్పుడే సమాజంలో పేదరికం ఉండదు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.గురువారం నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
సరస్వతి శిశు మందిర్ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో కట్టించిన ఇడెం శ్రీనివాస్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరు సమాజ సేవ చేయాలనే తపన ఉండాలని కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచన చేసినప్పుడే సమాజంలో పేదరికం అనేది ఉండదన్నారు.భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆర్థికంగా బలంగా ఉండి సమాజానికి సేవచేసే శక్తి ఉండి కూడా సమాజ సేవ చేయకపోవడం నా దృష్టిలో నేరమన్నారు.
సహాయం చేయాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం లేదని సాయం చేయాలన్న మనసు బుద్ధి ఉండాలి అన్నారు.. ధనవంతులు, మేధావులు, చదువుకున్న వారు పేదల పక్షాన పని చేయాలని అప్పుడు పేదలకు కష్టాలు ఉండవన్నారు.బడి అంటే గుడి లాంటిదని గ్రామాలలో ఒక్కొక్క కులానికి ఒక గుడి ఉంటుందని కానీ ఊరందరి బడి ఒక్కటే అన్నారు.
మొదటి విడతగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం ద్వారా కొందరు వ్యక్తుల సహాయ సహకారాల ద్వారా అభివృద్ధి చేసుకుందామన్నారు.మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజగోపాల్ రెడ్డి రాజీ పడే ప్రసక్తే లేదని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శం నియోజకవర్గం గా తీర్చిదిద్దడమే నా లక్ష్యమన్నారు.