20-08-2025 08:01:06 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మొండికుంటలోని రాజీవ్ సెంటర్ వద్ద భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు తోట నాగయ్య, కందాల వెంకటరెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొండికుంట మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు. సాంకేతిక విప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థ, యువత శక్తీకరణలో ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయమని గుర్తుచేశారు.
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటికీ ప్రేరణనిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ రూపంలో కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాసేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు కొండబత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాసరెడ్డి, కొల్లు నర్సిరెడ్డి, కొమరం శ్రీను, ముస్కు వీరారెడ్డి, చిట్యాల సత్యనారాయణ, కృష్ణమాచారి, పాదూరి నర్సింహారెడ్డి, తోట నర్సయ్య, రమణారెడ్డి, రాంప్రసాద్, తిప్పారెడ్డి రామిరెడ్డి తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.