21-05-2025 05:17:14 PM
మంత్రి పొన్నం ప్రభాకర్..
హుస్నాబాద్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి సాంకేతిక విప్లవంతో నడిపించారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఆయన రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండల కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు, ఇందిరాగాంధీ 'గరీబీ హటావో' నినాదం, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం, పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.
"ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీకి రాజీవ్ గాంధీ దార్శనికతే కారణం. ఆయన చొరవతోనే దేశంలో సాంకేతిక విప్లవం మొదలైంది" అని అన్నారు. రాజీవ్ గాంధీ కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, 18 సంవత్సరాలకే ఓటు హక్కు, పంచాయతీ రాజ్ చట్టం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జవహర్ రోజ్గార్ పథకం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చారని కొనియాడారు.