19-10-2025 12:10:46 AM
మైనార్టీ అభ్యర్థిగా మిర్జా షఫియుల్లా బేగ్
రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ ప్రవేశించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంది. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ రాష్ర్టంలో జూబ్లీహిల్స్లో తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఆమోదంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆర్ఎల్డీ తరఫున మిర్జా షఫియుల్లా బేగ్ పోటీ చేయనున్నట్టు రాష్ర్ట నాయకత్వం ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికల సంఘం కేటాయించిన చేతిపంపు గుర్తు తో షఫియుల్లా బేగ్ ప్రచారం సాగిస్తారు.
23 నుంచి రాష్ర్టవ్యాప్త రథయాత్ర
ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి రాష్ర్టవ్యాప్త రథయాత్రను ప్రారంభించనున్నట్లు రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున పోటీ చేసి, నిజాయితీ, నిబద్ధతతో స్థానిక పాలనలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
రథయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజల ముందుంచుతామని దిలీప్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి ఇవ్వాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు.
సమావేశంలో మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సుధాకర్, ఆర్ఎల్డీ సార్వత్రిక కార్యదర్శులు,ముద్దం మల్లేశ్, గిరి. కుందే, రిషబ్ జైన్, ఓంకార్ గౌడ్, సిద్దం కుమార్, నరసింహ రావు, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బీరప్ప బోనగిరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి మిర్జా షఫియుల్లా బేగ్ పాల్గొన్నారు.