19-07-2025 12:33:42 AM
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట జూలై 18 ( విజయ క్రాంతి ): అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు అహార భద్రత కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ...ప్రజా పాలన లో భాగంగా అర్హులైన లబ్దిదారులకు ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 5,600 రేషన్ కార్డులు మంజూరీ చేయడం జరిగిందని,15,632 యూనిట్లు మొత్తం 18,640 మంది సుమారు ఆలేరు నియోజకవర్గంలోనే 36 వేల మందికి 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు.
గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యంతో పేద వారు అన్నం తినకుండా బియ్యం దళారులకు అమ్ముకునేవారు, ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన మేరకు పేదవారు కడుపునిండా అన్నం తినాలనే సంకల్పనతో ముఖ్యమంత్రి ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం ప్రతి పేదవారు సన్న బియ్యం తో కడుపునిండా తినాలని గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.
రైతులకు, మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో అమలవుతున్నాయన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు ,మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్ లు ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి ,విమల వెంకటేష్,ఆర్డీఓ కృష్ణారెడ్డి,ఆలేరు నియోజక వర్గం తహసీల్దార్ లు , ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.