23-08-2025 12:12:13 AM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గణేష్ చవితి ఉత్సవాలను శాంతియుతంగా వైభవంగా నిర్వహించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ నగరం లోని గణేష్ భవన్ లో గణేష్ ఉత్సవ సమితి గణేష్ మండపాల నిర్వాహకులతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటిల్లిపాదిని వినాయక చవితి నవరాత్రుల్లో భాగం చేయాలని చెప్పారు.
మహిళల చేత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, చిన్నారుల చేత హనుమత్ చాలిసా పారాయణం, రామాయణ, భగవత్ గీతలపైన ధార్మిక ప్రవచనాలు నిర్వహించాలన్నారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు ఉండాలన్నారు. కాలనీల్లో ఉండే చిన్నారులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగం చేస్తూ, రామాయణ, భగవత్ గీత ల శ్లోకాలు పోటీలను నిర్వహించాలన్నారు. గణేష్ మండపం దగ్గర, నిర్వాహకులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి గీతాలను మాత్రమే పెట్టేలా చూసుకోవాలని చెప్పారు.
ఊరేగింపుగా త్వరగా రావాలి
నిమజ్జనం రోజు వీలైనంత త్వరగా గడియారం చౌరస్తా వద్దకు ఊరేగింపు గా రావాలన్నారు. ఉత్సవాలు జరుపుకోవడం ఎంత ముఖ్యమో వినాయక నిమజ్జనం అనంతరం క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యమన్నారు.