23-05-2025 01:05:04 AM
కుంట్లూరులో బాధిత కుటుంబాలకు పరామర్శ
ఎల్బీనగర్, మే 21 : రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న డబ్బాలను 24 గంటల్లో తొలగించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాలతో గురువారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ అధికారులు కదిలారు. కుంట్లూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి, ప్రమాద స్థలిని పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లను ఆక్రమించి, ఇరువైపులా ఉన్నటువంటి డబ్బాలను 24 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. ఎవరైనా నాయకులు అడ్డొచ్చిన కూల్చివేతలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ అధికారులు హయత్నగర్ నుంచి కుంట్లూరు, పసుమాముల మీదుగా ఓఆర్ ఆర్ వరకు ఎక్కడా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా కూల్చివేతలు చేపట్టారు.