04-01-2026 12:15:04 AM
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీ మహేష్ కుమార్గౌడ్
ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం అన్యాయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్యెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించి, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో శనివారం జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్ అసిస్టెంట్స్ యూనియన్ భారీ ధర్నాలో బి. మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ ధర్నాలో డా. జి సంజీవ రెడ్డి, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు డా. జి సంజీవ రెడ్డి, ముఖ్య ఉపాధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వై. నాగన్న గౌడ్, భాస్కర్ రెడ్డి, అదిల్ షరీఫ్, ఫీల్ అసిస్టెంట్స్ యూనియన్ నేతలు సిద్ది రాజు, బి. రవి, చల్ల వెంకటేశ్వరులు తదితరులు పాల్గొనగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్ర శేఖర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్బంగా బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం రూపకర్త అయిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండిం చారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ పథకానికి గాంధీజీ పేరు అనుసంధానమై ఉండటం చరిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు.