11-01-2026 06:09:15 PM
హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్ నేరస్థులతో కలిసి రూ.547 కోట్ల మోసానికి పాల్పడిన ఒక ప్రధాన సైబర్ క్రైమ్ ముఠాను జిల్లా పోలీసులు ఛేదించారు. ఖమ్మం జిల్లాలో సైబర్ మోసానికి సంబంధించిన లావాదేవీలను దారి మళ్లించిన మ్యూల్ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నందుకు 24 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 18 మందిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 2022 నుంచి 2025 మధ్య క్రమపద్ధతిలో పనిచేస్తున్న పెద్ద, వ్యవస్థీకృత సైబర్ మోసం నెట్వర్క్లో నిందితులు పాల్గొన్నట్లు దర్యాప్తులో తెలిందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.
ఆదివారం పెనుబల్లి పోలీస్స్టేషన్లో పోలీస్ కమిషనర్ సునీల్దత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితులు ఉడతనేని వికాస్ చౌదరి, పొట్రు మనోజ్ కల్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రకాష్, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించి సైబర్ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికిరణ్ డిసెంబర్ 24, 2025న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జరిపిన దర్యాప్తులో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులైన వికాస్ చౌదరి, మనోజ్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, సహచరుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడయ్యాయి.
మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన భార్య మేడ భానుప్రియ రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.45.62 కోట్లు, మనోజ్ కళ్యాణ్ బావమరిది మేడ సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, కరీంనగర్కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహ కిరాణా, డెయిరీ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు సత్తుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి నిరుద్యోగ యువకులను ఉద్యోగాల హామీతో ఆకర్షించి, ప్రముఖ బ్యాంకుల్లో వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి, వారి ఖాతా ఆధారాలను పొంది, ఆ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరాల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను డిపాజిట్ చేశారని సీపీ వివరించారు.