26-01-2026 05:59:25 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గోవిందరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, స్వేచ్ఛలు ప్రతి పౌరుని బాధ్యతలతోనే పరిపూర్ణతను సాధిస్తాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో పోలీస్ విభాగం కీలక భూమిక నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తి–ప్రాణ రక్షణే తమ ప్రధాన కర్తవ్యమని,ప్రజలు చట్టానికి లోబడి జీవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, దేశభక్తి, త్యాగస్ఫూర్తితో విధులు నిర్వర్తించినప్పుడే గణతంత్ర విలువలకు నిజమైన అర్థం చేకూరుతుందని, యువత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని, దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.