19-08-2025 12:00:00 AM
హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన
హుస్నాబాద్, ఆగస్టు 18 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు నిరసనగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం హుస్నాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ వినూత్న నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు.
“ప్రభుత్వం ఒకవైపు యూరియా కొరత లేదని ప్రకటనలు చేస్తుంటే, రైతులు మాత్రం తమ పనులను వదిలిపెట్టి ఎరువుల దుకాణాల చుట్టూ రోజంతా తిరుగుతున్నారు. ఉదయం 8 గంటలకే హుస్నాబాద్కు వచ్చి సొసైటీల వద్ద బారులు తీరుతున్న రైతులను చూస్తే ప్రభుత్వ ప్రకటనలు ఎంత అవాస్తవమో అర్థమవుతుంది” అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు.
గతంలో కూడా కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎరువుల కరువు, కరెంట్ కరువు, కమిటీల పేరుతో కాలయాపన తప్ప చేసిందేమీ లేదు” అని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఆ పార్టీ పట్టణ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, నాయకులు బుర్ర శ్రీనివాస్ , ఇంద్రాల సారయ్య, బూర వెంకన్న, పాకాల శ్యామ్ సుందర్, మేకల వికాస్, భూక్య రాజు, దీకొండ ప్రవీణ్, తిరుపతి, రాజయ్య పాల్గొన్నారు.
యూరియా కోసం బారులు తీరిన రైతులు
చేగుంట, ఆగస్టు 18 : యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు. ఉదయం నుండి ఎరువుల దుకాణాల వల్ల బారులు తీరి నిల్చుంటున్నారు. చేగుంటలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం ముందు రైతులు భారీగా లైన్లో నిలబడి యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు భారీ నుండి, అతిభారీ వర్షాలు అని ప్రభుత్వ అధికారులు ప్రకటించినా లెక్క చేయకుండా రైతులు యూరియా కోసం కష్టాలు పడడం తప్పడం లేదని వా పోతున్నారు. ప్రభుత్వం యూరియా పె దృ ష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.