27-05-2025 12:00:00 AM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, మే 26 (విజయక్రాంతి): మోడీ నాయకత్వంలో చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ రెడ్డి ఆడుథూ కీలుబొమ్మగా మారిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ జగదీశ్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మన సంపద ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే కృష్ణ దోపిడీ అయిందని, బనకచర్లతో గోదారి దోపిడీకి మరో కుట్ర జరుగుతుందన్నారు.
బనక చర్ల ద్వారా గోదావరి జలాలు దోపిడీ జరుగుతున్నా రేవంత్ మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. బీజేపీ , టీడీపీ , కాంగ్రెస్ కలిసి తెలంగాణా నీటిని దోపిడీ దోపిడీ చేస్తూ ఈ ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ర్టంలో మంత్రులు కమిషన్ల పనిలో ఉంటే.. చంద్రబాబు తెలంగాణ నీళ్లను దోచుకునే పనిలో ఉన్నారన్నారు.
కండ్ల ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. కెసిఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదన్నారు. పాలన చేతకాక పోతే క్షమాపణ చెప్పి పాలకులు రాజీనామా చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఎస్ జి ఎం స్టేడియంలో 15 రోజులపాటు జరుగనున్న సూర్యపేట క్రికెట్ ప్రీమియం లీఫ్ ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఐకేపీ కేంద్రాల్లో గింజలేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి...
ఐకీపీ కేంద్రాలలో గింజ లేకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన ధాన్యంను సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో దొంగలు పడ్డారని, సీఎం, మంత్రులు ఎవరికి దొరికింది వారే దోచుకుంటున్నార న్నారు. ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ముక్కి మొలకలోస్తున్నా.. కొనే దిక్కే లేకుండా పోయిందన్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల్లో పార్ బాయిల్డ్ వాసనలొస్తున్నాయన్నారు. ఋతుపవనాలొచ్చి దుక్కి దునాల్సిన రైతు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాచుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రెండు, మూడు రోజులకోసారి వచ్చే లారీల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో చివరికి రైతులు దళారుల కాళ్ళు పట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. అన్ని రంగాలతో పాటు రైతంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందన్నారు. ఈయన వెంట మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు ఉన్నారు.
టీజేఎఫ్ రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ..
ఈనెల 31న హైదరాబాద్ లో జరుగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ వేడుకల సభకు సంబందించిన పోస్టర్ ను సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక పాత్ర పోషించింది అన్నారు.
జర్నలిస్టులు ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా ఎండగడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు.అలాగే తెలంగాణపై పక్క రాష్ట్రాలు చేస్తున్న కుట్రలను వెలుగులోకి తీసుకువచ్చి వాటిని తిప్పి కొట్టేలా చూడాలన్నారు. సంఘం రజతోత్సవ సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగ యాదవ్, సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జే వీరయ్య, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు కొండంత అండ బీఆర్ఎస్..
కార్యకర్తలకు కొండంత అండ టిఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జేతూ నాయక్ తండా కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త నునావత్ కిషన్ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా పార్టీ ప్రమాద బీమా నుండి మంజూరు అయిన రూ.2 లక్షల చెక్కును సోమవారం ఆయన సతీమణి సుగుణమ్మ కు స్థానిక క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.